Thursday 16 February 2017

బాధ్యత

బాధ్యత
మా అమ్మ  చిన్ననాటి స్నేహితురాలు లీల ఆంటీ  మరణ వార్త ఆలస్యము గా తెలియడముతో తెలిసిన వెంటనే వైజాగు నుండి బయలుదేరి హైదరాబాదు లో ఉన్న లీల  ఆంటీ ఇంటికి నేను,అమ్మ చేరుకున్నాను.ఆ రోజు ఆదివారము కావడముతో వాసు అంకుల్  వాళ్ళ  పిల్లలు రోజీ, శ్రీను ముగ్గురు ఇంటి వద్దనే ఉన్నారు.మమ్మల్ని  చూడగానే ముగ్గురూ ధుఖం ఆపుకోలేక ఏడ్చేశారు.పిల్లలిద్దరూ అమ్మని  గట్టిగా వాటేసుకుని విడువనేలేదు.
          ‘’ అసలు ఎలా ఇలా జరిగింది,లీల ఆరోగ్యముగానే ఉంది కదా,రెండు నెలల క్రితం నేను తనతో మాట్లాడాను ,అప్పుడు నాతో తను ఏమీ చెప్పనే లేదు ,నేను కంపెనీ ప్రొజెక్ట్ పని మీద ఏడాది క్రిందట  అమెరికా వెళ్ళాను,నిన్ననే ఇండియా వచ్చాను,ప్రొజెక్టు చివరిదశలో ఉండడము వలన గత నెల రోజులు గా ఎవరితోనూ మాట్లాడలేనంత పనిలో మునిగిపోయాను,వచ్చిన వెంటనే విషయము తెలిసి ఆశ్చర్యపోయాను.వెంటనే బయలుదేరి వచ్చేశాను,అసలు ఏమైంది వాసుగారు ’’ అని అమ్మ ఒకటే  ప్రశ్నల వర్షం కురిపించింది .  ‘’మాకు విషయము తెలిసేసరికే డాక్టర్లు ఏమి చెయ్యలేమని చెప్పేసారు, తనకి కేన్సర్ చివరి దశ, తెలిసినవారు చెప్పిన డాక్టర్లు అందరికీ చూపించాను,వైధ్యము  చేయించాను, కానీ అంతా నెలరోజులలోనే ముగిసిపోయింది’’ అని వాసుగారు  బోరున విలపించారు.వింటున్న మాకు బాగా ఏడుపు వచ్చింది.ఇంకా ఏడవడానికి కన్నీళ్లే లేవన్నంతగా అందరమూ  ఏడిచాము.
                       తరువాత  లోపలికి వెళ్ళిన నాకు ఇల్లు చూస్తే ఒక్కసారిగా భయంవేసింది .ఆడది లేని ఇల్లు ఇలా ఉంటుందా అని అనిపించింది.గదులలో ఎక్కడ విడిచిన బట్టలు అక్కడే పడిఉన్నాయి.ఏవి విడిచినవో, ఏవి ఉతికినవో అర్దము కావడము లేదు.పక్క బట్టలు అలానే ఉన్నాయి.వంటగదిని చూస్తే అది స్టోర్ రూమ్ లా ఉంది. పొయ్యి  మీద బాగా జిడ్డు పేరుకుపోయి ఉంది,గట్టు మీద చీమలు తిరుగుతున్నాయి,క్రింద గచ్చు కాళ్ళకు అతుక్కుపోతుంది.ఇంకా డైనింగ్ టేబుల్ గురించి చెప్పనక్కర్లేదు,బయట నుండి తెచ్చుకున్న పోట్లాల కవర్లు,కాగితాలు అన్నీ అక్కడే పడి ఉన్నాయి.టేబుల్ తుడిచి ఎన్ని రోజులయ్యిందో అని అనుకున్నాను.రోజీ ని పిలిచి’’ ఏమిటమ్మా ఇల్లు ఇలా ఉంది  పనమ్మాయి రావడము లేదా’’ అని అమ్మ  అడిగింది ,‘’ఏమో ఆంటీ నాకు తెలియదు’’ అని సమాదానము ఇచ్చి వెళ్లిపోయింది.ఆ మాట విన్న వాసుగారు  ‘’హైదరాబాదు లో పనివాళ్ళ గురించి మీకు తెలియనిది ఏముంది,దొరకడమే  కష్టము,ఒకవేళ దొరికినా సమయానికి రారు,వాళ్ళు వచ్చిన సమయానికి మేము ఇంట్లో ఉండము,లీల ఉంటే తానే చూసుకునేది,ఎన్ని రోజులని నేను ఆఫీసుకి సెలవు పెట్టి ఇంట్లో ఉంటాను,ఈ రోజు ఆదివారము కదా ఎవరైనా దొరికితే పని చేయిద్దామని చూస్తున్నాను’’ అని బయటికి చూస్తున్న వాసు గారి తో ‘’మరి వంట ఎవరు చేస్తున్నారు’’ అని అడిగింది. ‘’ఏముంది మూడు పూటలా బయట నుండి తెచ్చుకుని తింటున్నాము’’ అని విరక్తిగా సమాధానము ఇచ్చిన వాసుగారితో ‘’అదేమిటి రోజీకి ఏమీ చేయడము రాదా?’’  అని అడిగింది.’’రోజీనా! అది ఇంకా చిన్న పిల్ల తనకేమి తెలుస్తుంది, మీకు టిఫిన్ తెస్తాను ఉండండి’’ అని చెప్పి బయటకి వెళ్ళిపోయారు అంకుల్.
              ఇవి అన్నీ వింటున్న నాకు ఒక్కసారిగా తలతిరిగినట్లు అనిపించింది. మా అమ్మ ఎప్పుడూ నన్ను ఆపని చెయ్యు,ఈ పని చెయ్యు అని చెబుతుంటే విసుగుకునేదాన్ని.ఎందుకమ్మా అలా ఏదో ఒక పని చెబుతూనే ఉంటావు పెళ్లయ్యాక నీలా ఎలాగూ చెయ్యక తప్పదు కదా! అప్పుడు చేస్తాలే ఇప్పుడు వదిలేయ్ నన్ను అని అనే దాన్ని .కాని మా అమ్మ అలా కాదు నీ పనులు నీవే చేసుకోవాలి,ఎవరి మీద ఆదారపడకూడదు,అన్నీ పనులు నీకు వచ్చిఉండాలి ,భాద్యతగా అన్నీ చేసుకోవాలి అని నాకు పనులు నేర్పించింది.అయిష్టముగానైనా కొన్ని పనులు నేర్చుకున్నాను .మా అమ్మ పని చెప్పిన ప్రతీసారీ నేను విసుగుకోవడం అయిష్టముగా చేయడం మా అమ్మ నాకు నచ్చ చెప్పడము అన్నీ ఒక్కసారిగా మా కళ్ళముందు కదలాడాయి.రోజీ ఇంజనీరింగు మొదటి సంవత్సరము,శ్రీను పదవతరగతి చదువుతున్నారన్నమాటే గాని వాలిద్దరికి  ఏమీ తెలియదు,ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే రోజీ కి తను వేసుకోవలసిన బట్టల ఎక్కడ ఉన్నాయో ,ఏవి వేసుకోవాలో కూడా తెలియదు.ఏది అడిగినా ఏమో ఆంటీ నాకు తెలియదు,అన్నీ మా అమ్మే చూసుకుంటుంది అని ఒకే ఒక్క సమాదానము చెబుతుంది.తెలిసిందల్లా కాలేజీ కి వెల్లడము ,రావడము అంతే అది తప్ప ఇంకేమీ తెలియదు.
              లీల ఆంటీ  పిల్లలిద్దరికీ ఏపనీ నేర్పకుండా,చెప్పకుండా అన్నీ తనే చేసిపెట్టేది అంట,వాళ్ళకు బ్రష్ ల దగ్గర నుండి పడుకునే పక్క దుప్పట్ల వరకూ అన్నీ తనే వాళ్ళకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకునేదంట.తను  ఉన్నన్నాళ్లు బాగుండేది, తను చనిపోగానే ఒక్కసారిగా ఇల్లు ఎలా అయిపోయిందో,వాసు అంకుల్ కి అన్నీ కాళ్ళ దక్కరికి తెచ్చిపెట్టేదంట .ఒకసారి అమ్మ  ఇవన్నీ గమనించి  లీల అంటీని అడిగిందంట   ‘’ఎందుకే అన్ని సేవలు చేస్తావు,కాస్త వాళ్ళపని వాళ్ళని చేసుకోనివ్వు’’అని .‘’పోనీలేవే ఆయన పొద్దున్న నుండి ఆఫీసు లో కష్టపడి వస్తారు ఆ మాత్రము చేస్తే అలిసిపోతానా ఏంటి,ఇంకా పిల్లలంటావా వాళ్ళు చదివి,చదివి అలిసి పోయి వస్తారు,ఇంకేమీ చేస్తారు?నేను ఎటూ ఇంట్లోనే ఉంటాను కదా’’అని చిరునవ్వు తో సమాధానము ఇచ్చిందంట.ఆ మాట నాకు చెబుతూ లీలా ఆంటీ గుర్తుకు వచ్చిందేమో  అమ్మ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
                         వాసు అంకుల్ తో అమ్మ” రోజీ కి అన్నీ నేర్పించండి,తను ఇంకా చిన్న పిల్ల కాదు,ఇలా అయితే కష్టము” అని,చాలా విషయాలు చెప్పింది. అన్నింటికీ అంకుల్ సరే అని అన్నారు ఏమో ఏమి చేస్తారో మరి,పాపం రోజీ ని తలుచుకుంటే బాధ అనిపించింది నాకు ,ఇన్నాళ్ళు ఏ కష్టము తెలియకుండా పెరిగింది ,ఇప్పుడు భాద్యతలన్నీ ఒక్కసారిగా మీదపడేసరికి ఎలా ఉక్కిరిబిక్కిరి అవుతుందో పాపం.అమ్మో!నేను మాత్రం మా అమ్మ చెప్పినట్లు అన్నీ నేర్చుకుంటాను.పని చేయవలసిన అవసరము ఉన్నా లేకపోయినా ముందు నేర్చుకోవాలి.ఏ సమయానికి ఏ అవసరము వస్తుందో,ఏ భాద్యత నెత్తిమీద పడుతుందో,అమ్మ చెబుతుంటే తేలికగా తీసుకున్నాను,రోజీ పరిస్థితి చూశాక అర్ధము అయ్యింది నాకు పెద్దలు,అమ్మ ఏది చెప్పినా మన మంచికే చెబుతారు అని.
(ఈ కథ గో తెలుగు .కామ్ అనే అంతర్జాల పత్రిక లో ఆగస్టు నెల 2016 న ప్రచురిత మయ్యింది.)